ప‌రుగు తేడాతో సెంచ‌రీ మిస్ చేసుకున్న ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌

గుజ‌రాత్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లేయ‌ర్ సోఫీ డివైన్ విరుచుకుప‌డింది. కేవ‌లం 33 బంతుల్లో 99 ప‌రుగులు చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2023 4:57 AM GMT
Sophie Devine, Sophie Devine  misses century

సోఫీ డివైన్

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జ‌ట్టు కాస్త ఆల‌స్యంగా పుంజుకుంది. తొలి ఐదు మ్యాచుల్లో ఓడిన ఆ జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. త‌ద్వారా ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

తాను చెల‌రేగి ఆడితే ఎలా ఉంటుందో సోఫీ డివైన్ చూపించింది. బంతి ప‌డిందే మొద‌లు బాదుడే ల‌క్ష్యంగా పెట్టుకున్న డివైన్ కేవ‌లం 36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాది 99 ప‌రుగులు చేసింది. అయితే.. సెంచ‌రీకి కేవ‌లం ఒక్క ప‌రుగు దూరంలో ఔటైంది. ఆ ఒక్క ప‌రుగులు చేసుంటే మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌లో తొలి సెంచ‌రీ చేసిన బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించేది.

సోఫీ డివైన్ విధ్వంసంతో గుజ‌రాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు జ‌ట్టు 15.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేధించింది. మ‌హిళ‌ల ప్రాంఛైజీ క్రికెట్‌లో ఇదే అత్య‌ధిక ఛేద‌న కావ‌డం విశేషం. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (31), ఎలీస్ పెరీ (19 నాటౌట్‌), హీథెర్ నైట్ (22 నాటౌట్‌) రాణించారు.

అంత‌క‌ముందు గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్‌ ( 42 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఆష్లీ గార్డ్‌నర్‌ ( 26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించారు.

Next Story