కోహ్లీ కోసం ధోని చేసిన త్యాగం ఏంటో తెలుసా..?
MS Dhoni’s sweet gesture to Virat Kohli in 2014 ICC World T20 semi-final revisited. భారత క్రికెట్లో ఎంఎస్ ధోని, విరాట్
By Medi Samrat Published on 24 Dec 2020 6:13 PM IST
భారత క్రికెట్లో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాళ్లో అందరికి తెలిసిందే. మైదానంలో కాకుండా బయట కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక ధోని ఫినిషింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో మ్యాచ్ల్లో ఓడిపోతుందన్న తరుణంగా తనదైన శైలిలో విజృంభించి గెలిపించిన సందర్భాలు అనేకం. కాగా.. కోహ్లీ కోసం ధోని ఓ త్యాగం చేశాడు. తాజాగా ఐసీసీ అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.
2014 టీ20 ప్రపంచకప్లో ధోని విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం కోహ్లికి ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో 18 ఓవర్ నాలుగో బంతికి 167 పరుగుల వద్ద రైనా అవుటయ్యాడు. కోహ్లి 68 పరుగులతో అజేయంగా ఉన్నాడు. భారత్ విజయానికి ఇంకా 8 బంతుల్లో 2 పరుగలు కావాలి. 18 ఓవర్ 5వ బంతి ఆడిన కోహ్లి సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్లోకి వచ్చిన ధోనిని విన్నింగ్ షాట్ కొట్టమన్నట్లుగా కోహ్లి అతడికి చెప్పాడు. కానీ ధోని అనూహ్యంగా ఆ బంతిని డిఫెన్స్ ఆడాడు. అయితే కోహ్లి రన్ కోసమని ముందుకు పరిగెత్తాడు.. కానీ ధోని స్పందించలేదు. ఏమైంది అన్నట్లు కోహ్లి.. ధోని వైపు చూశాడు. చివరి ఓవర్ తొలి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టి భారత్కు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన విరాట్ విన్నింగ్ షాట్ ఆడాలనే అలా చేశానని మ్యాచ్ అనంతరం ధోని చెప్పాడు. తాజాగా ఆ వీడియో ఐసీసీ మరోసారి పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల చేసింది. అనంతర విరాట్ కోహ్లి 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి రెచ్చిపోవడంతో.. భారత్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం పాలై రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించే సువర్ణావకాశాన్ని కోల్పోయింది.