స‌ఫారీల‌తో టీ20 సిరీస్‌.. బుమ్రా స్థానంలో హైద‌రాబాదీ పేస‌ర్

Mohammed Siraj replaces Bumrah for last two South Africa T20Is.టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2022 6:10 AM GMT
స‌ఫారీల‌తో టీ20 సిరీస్‌.. బుమ్రా స్థానంలో హైద‌రాబాదీ పేస‌ర్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. పేస్ గ‌న్ బుమ్రా వెన్నుగాయంతో ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌కు బుమ్రా స్థానంలో హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసింది. మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల‌కు సిరాజ్ అందుబాటులో ఉంటాడ‌ని తెలిపింది.

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రెండో టీ20 అక్టోబ‌ర్ 2న గుహ‌వాటిలో, మూడో టీ20 ఇండోర్‌లో అక్టోబ‌ర్ 4న జ‌ర‌గ‌నున్నాయి. స్వదేశంలో చివ‌రి సారి సిరాజ్ శ్రీలంక‌పై ఆడాడు. ఫిబ్ర‌వ‌రిలో ధ‌ర్మ‌శాల వేదికగా జ‌రిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 22 ప‌రుగులు ఇచ్చి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఇక బుమ్రా గాయంపై బీసీసీఐ స్ప‌ష్ట‌త ఇచ్చింది. బుమ్రా వెన్ను గాయానికి గురైయ్యాడు. ప్ర‌స్తుతం అత‌డు బీసీసీఐ వైద్య బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు అని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక ఇప్ప‌టికే మోకాలి గాయం వ‌ల్ల ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మెగా టోర్నికీ దూరం అయిన సంగ‌తి తెలిసిందే. ఇక బుమ్రా స్థానంలో ప్ర‌పంచ‌క‌ప్‌ను ఎవ్వ‌రిని ఎంపిక చేయ‌లేదు.

Next Story