ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వీసీగా కరణం మల్లీశ్వరి

Karanam Malleswari appointed as first VC of Delhi sports university.తెలుగింటి ముద్దుబిడ్డ‌, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2021 5:17 AM GMT
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వీసీగా కరణం మల్లీశ్వరి

తెలుగింటి ముద్దుబిడ్డ‌, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ అయిన భార‌త వెయిట్ లిఫ్టింగ్ దిగ్గ‌జం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రీకి త‌గిన గౌర‌వం ల‌భించింది. ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ)గా నియమితురాలైంది. స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్ప‌డిన త‌రువాత తొలి వైస్‌ఛాన్స్‌ల‌ర్‌గా మ‌ల్లీశ్వ‌రికే అవ‌కాశం ద‌క్కింది. ఈ మేర‌కు విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్‌ హఖ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే విశ్వవిద్యాలయం వీసీగా మల్లీశ్వరి బాధ్యతలు చేపట్టే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ మాజీ వెయిట్‌లిఫ్టర్‌ సిడ్నీ (2000) ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పశ్చిమ ఢిల్లీ జిల్లాలోని ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని నిర్మిస్తోంది. మరో పదేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. క్రీడాకారులు డిగ్రీ కోసం తమకు సంబంధం లేని ఏదొక కోర్సులో చేరి చదువుతుంటారు.కానీ, ఈ విశ్వవిద్యాలయంలో అలా కాకుండా క్రీడాకారులు ఏ ఆటలో అయితే, రాణించాలని ఆశిస్తారో అందులోనే డిగ్రీ చేసేలా విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నారు.క్రికెటర్‌.. క్రికెట్‌లో, బాక్సర్‌.. బాక్సింగ్‌లోనే డిగ్రీ చేయొచ్చు. స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి ఆ రంగానికే చెందిన ప్రముఖులు వీసీగా ఉంటే బాగుంటుందని భావించిన ఢిల్లీ ప్రభుత్వం మల్లీశ్వరిని వీసీగా నియమించింది.

Next Story