మహిళా రెజ్లర్లకు కపిల్‌దేవ్‌ మద్దతు

Kapil Dev-led 1983 World Cup team 'disturbed' and 'distressed' with wrestlers being 'manhandled'. లైంగిక వేధింపులపై మహిళా రెజర్లు చేస్తున్న నిరసనకు మద్దతు పెరుగుతోంది.

By Medi Samrat  Published on  2 Jun 2023 1:00 PM GMT
మహిళా రెజ్లర్లకు కపిల్‌దేవ్‌ మద్దతు

లైంగిక వేధింపులపై మహిళా రెజర్లు చేస్తున్న నిరసనకు మద్దతు పెరుగుతోంది. రెజ్లర్లు పతకాలు గెల్చుకున్నప్పుడు పోటీలు పడి అభినందనలు తెలిపిన సెలబ్రిటీలలో చాలా మంది కేంద్రమంత్రుల్లాగే ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. కారణం రెజ్లర్లు నిరసన చేస్తున్నది రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా కావడం! కానీ మానవత్వం ఉన్నవారు, కాసింత ధైర్యం ఉన్నవారు బాహాటంగా రెజ్లర్లకు మద్దతు తెలుపుతున్నారు. రెజ్లర్లు కూడా తమ నిరసనను తీవ్రతరం చేస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చకపోతే తాము కష్టపడి గెల్చుకున్న పతకాలను గంగా నదిలో కలిపేస్తామని హెచ్చరించారు. అందుకు ఓ గడువు కూడా పెట్టారు. ఈ సమయంలో 1983 ప్రపంచ కప్‌ను గెల్చుకున్న కపిల్‌దేవ్‌ సేన రెజ్లర్లకు విన్నపం చేసింది. ఆ పతకాలు మీవి మాత్రమే కావని, వాటి విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని కోరింది. రెజ్లర్లతో పోలీసులు దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు తమను ఎంతగానో కలవరపెట్టాయని, ఎంతో శ్రమకోర్చి దేశం కోసం సాధించిన పతకాలను గంగలో నిమజ్జనం చేద్దామనే వారి ఆలోచన ఆందోళన కలిగిస్తోందని కపిల్‌దేవ్‌ బృందం తెలిపింది. ఆ పతకాల వెనక ఎంతో కృషి, త్యాగం ఉందని, అవి కేవలం వారికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. వాటిలో ఈ దేశ ప్రతిష్ఠ కూడా ఇమిడి ఉందని కపిల్‌ అండ్‌ కో తెలిపింది. ఈ విషయంలో వారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, అలాగే వారి బాధలకు సాధ్యమైనంత త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ఆశ తమకు ఉందని, చట్టం తన తని తాను చేస్తుందని తమ ప్రకటనలో రెజ్లర్లను కోరారు. గత ఆదివారం జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంట్‌ నూతన భవనం దగ్గరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా రెజ్లర్లతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారిని కొట్టారు. ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిని జంతర్‌మంతర్‌ దగ్గర దీక్ష చేసేందుకు అనుమతి నిరాకరించారు. ఆదివారం జరిగిన ఘటన చాలామందిని కలచివేసింది. రెజ్లర్లు కూడా తీవ్రంగా కుంగిపోయారు. తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం గంగలో నిమజ్జనం చేయడానికి వారు హరిద్వార్‌ వరకు వెళ్లారు. అయితే రైతు సంఘాల విజ్ఞప్తితో దానిని అయిదు రోజులకు వాయిదా వేశారు.


Next Story