ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే

IPL 2022 schedule announced by BCCI.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 3:30 PM GMT
ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 షెడ్యూల్ వ‌చ్చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభంకానున్న‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వెల్ల‌డించింది. రెండు న‌గ‌రాల్లోని (ముంబై, పుణె) నాలుగు మైదానాల్లో మొత్తం మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచులు అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నున్నాయి. టోర్నీ ఆన‌వాయితీ ప్ర‌కారం గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డిన జ‌ట్లు ఈ సారి తొలి మ్యాచ్ ఆడ‌నున్నాయి. ఈ ప్ర‌కారం మార్చి 26న శ‌నివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, డిఫెండింగ్ చాంఫియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీనికి ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక కానుంది.

ఈ సారి టోర్నిలో మ‌రో రెండు కొత్త జ‌ట్లు రావ‌డంతో మొత్తం జ‌ట్ల సంఖ్య 10కి చేరింది. దీంతో ప‌ది జ‌ట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీప‌డ‌తాయి. గ్రూప్ ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉండ‌గా.. గ్రూప్ బీలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.

ఒక్కో జ‌ట్టు 14 మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. రాత్రి జ‌రిగే మ్యాచ్‌ల‌న్నీ 7:30 గంట‌ల‌కు ఆరంభం కానుండ‌గా.. సాయంత్రం జరిగే మ్యాచ్‌ల‌న్నీ 3:30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. డ‌బుల్ హెడర్‌ మ్యాచ్‌ల‌న్నీ వారాంతంలో జ‌ర‌గ‌నున్నాయి. తొలి డ‌బుల్ హెడర్ మ్యాచ్ మార్చి 27న సాయంత్రం 3:30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ను బీసీసీఐ త‌ర్వాత ప్ర‌క‌టించనుంది. మే 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 15 ఎడిష‌న్ ముగియ‌నుంది.







Next Story