ఢాకా టెస్టులో భారత్ నెగ్గేనా..?
India need 100 runs, Bangladesh 6 wickets away from historic win. ఢాకా టెస్టులో భారత జట్టు విజయం ముందు నిలిచింది.
By M.S.R
ఢాకా టెస్టులో భారత జట్టు విజయం ముందు నిలిచింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ను బంగ్లాదేశ్ బౌలింగ్ ఆల్రౌండర్ మెహిదీ హసన్ ఇబ్బందులు పెట్టాడు. మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. శుభమన్ గిల్ (7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1) మెహిదీ హసన్ బౌలింగ్ లో వెనుదిరిగారు. కెప్టెన్ కేఎల్ రాహుల్(2)ను షకీబల్ హసన్ పెవిలియన్ పంపాడు. 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఉనద్కత్ (3), అక్షర్ పటేల్ (26) క్రీజులో ఉన్నారు. ఈ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 100 పరుగులు అవసరం కాగా.. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ రాణించడంపై ఆశలు పెట్టుకుంది భారత్.
బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌట్ అయింది. లిటన్ దాస్ 73 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జకీర్ హసన్ అర్ధ సెంచరీ (51)తో రాణించాడు. ఓవర్ నైట్ స్కోరు 7/0తో మూడో రోజు ఆట మొదలవ్వగా.. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 70.2 ఓవర్లలో 231 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ జాకిర్ హసన్ (51) అర్ధ సెంచరీతో రాణించాడు. నురుల్ హసన్ (31), తస్కిన్ అహ్మద్ (31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, అశ్విన్, ఉనాద్కట్ తలో వికెట్ రాబట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య బంగ్లా 227 పరుగులు చేయగా.. భారత్ 314 స్కోరు వద్ద ఆలౌట్ అయింది.