దంచికొట్టిన ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్య‌ర్‌.. తొలి టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం

India beat Sri Lanka by 62 runs.వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా ఇప్పుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2022 3:27 AM GMT
దంచికొట్టిన ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్య‌ర్‌.. తొలి టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం

వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా ఇప్పుడు శ్రీలంక‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌ను ఘ‌నంగా మొద‌లెట్టింది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిష‌న్‌, శ్రేయాస్ అయ్య‌ర్ విధ్వంసం సృష్టించ‌గా.. ఆ త‌రువాత భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు తోడు మిగ‌తా బౌల‌ర్లు స‌త్తా చాట‌డంతో ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 62 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఇషాన్‌ కిషన్‌ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ‌శ‌త‌కాల‌తో బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోయ‌గా.. రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. దీంతో భార‌త్‌.. శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్లలో దసున్‌ షనక, లహిరు కుమార చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని చేదించేందుకు బ‌రిలోకి దిగిన లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 137 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. చ‌రిత్‌ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు) ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేయ‌గా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫ‌లం అయ్యారు. దీంతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజ‌యంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భార‌త్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 శ‌నివారం జ‌ర‌గ‌నుంది.

Next Story