తొలి టి20లో ఇంగ్లాండ్ చిత్తు.. అద‌ర‌గొట్టిన హార్దిక్

Hardik Pandya stars as India beat England by 50 runs.మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమ్ఇండియా ఘ‌నంగా ఆరంభించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2022 3:41 AM GMT
తొలి టి20లో ఇంగ్లాండ్ చిత్తు.. అద‌ర‌గొట్టిన హార్దిక్

మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమ్ఇండియా ఘ‌నంగా ఆరంభించింది. ఇంగ్లాండ్‌తో గురువారం సౌతాంప్టన్‌ వేదికగా జ‌రిగిన తొలి టి20లో భార‌త్ 50 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 198 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (51; 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (39; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్‌ హుడా (33; 17 బంతులోల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మోయిన్ అలీ, జోర్డాన్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 199 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి ఇంగ్లాండ్ కు శుభారంభం ద‌క్క‌లేదు. తొలి ఓవ‌ర్‌లోనే కెప్టెన్ బ‌ట్ల‌ర్‌(0) ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ పెవిలియ‌న్ చేర్చ‌గా.. ఆ త‌రువాత మ‌ల‌న్‌(21), లివింగ్ స్ట‌న్‌(0), జేస‌న్ రాయ్‌(4)ల‌ను హార్థిక్ పాండ్య ఔట్ చేసి మ్యాచ్‌ను భార‌త్ వైపు తిప్పాడు. మోయిన్ అలీ(36; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌(28; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) పోరాడిన ఫ‌లితం లేక‌పోయింది. వీరి పోరాటం ఓట‌మి అంత‌రాన్ని త‌గ్గిచ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డింది. వీళ్లిద్ద‌రి చాహ‌ల్ ఒకే ఓవ‌ర్ లో ఔట్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. చివ‌రికి ఇంగ్లాండ్ 19.3 ఓవ‌ర్ల‌లో 148 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో హార్థిక్ పాండ్య 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అర్ష్‌దీప్‌, చ‌హ‌ల్ చెరో రెండు, భువ‌నేశ్వ‌ర్‌, హ‌ర్ష‌ద్ ప‌టేల్ ఒక్కొవికెట్ తీశారు. ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన హార్థిక్ పాండ్యాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

అర్ష్‌దీప్‌ అరంగేట్రం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో అదరగొట్టి జాతీయ జట్టుకు ఎంపికైన యువ పేసర్‌ అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్ష్‌దీప్‌కు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క్యాప్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టి త‌న ఎంపిక స‌రైన‌దే అని నిరూపించాడు.

ఆ త‌ప్పులు పున‌రావృతం కానివ్వం : రోహిత్ శ‌ర్మ‌

మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ హార్థిక్ పాండ్యాను మెచ్చుకున్నాడు. 'మొదటి బంతి నుంచే గొప్ప ప్రదర్శన కనబరిచాం. బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. నిజానికి పిచ్‌ బాగుంది. మేము మంచి షాట్లు ఆడాము. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ నన్ను కట్టిపడేసింది. అద్భుతంగా రాణించాడు. భవిష్యత్తులో తను మరింతగా రాణించాలి. బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగాలి. తను బ్యాటింగ్‌ కూడా బాగా చేయగలడు. అందులో ఎలాంటి సందేహం లేదని' రోహిత్ అన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో తాము క్యాచ్‌లు వదిలేయడం నిరాశ కలిగించిందని, రానున్న మ్యాచ్‌లలో ఈ తప్పిదం పునరావృతం కాకుండా చూసుకుంటామని రోహిత్ చెప్పాడు.

Next Story