యశ్ దయాల్.. ఆ పీడ‌క‌ల నుంచి తేరుకుని.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు..!

ఐపీఎల్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ప్రయాణం గురించి ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతుంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై యష్ అద్భుత ప్రదర్శన చేశాడు.

By Medi Samrat  Published on  19 May 2024 8:45 AM GMT
యశ్ దయాల్.. ఆ పీడ‌క‌ల నుంచి తేరుకుని.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు..!

ఐపీఎల్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ప్రయాణం గురించి ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతుంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై యష్ అద్భుత ప్రదర్శన చేశాడు. త‌న‌ జట్టు ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. నాకౌట్‌కు చేరుకోవడానికి చెన్నై చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉంది. యష్ అద్భుతమైన ఓవర్‌ని బౌల్ చేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు, దీని కారణంగా CSK ప్లేఆఫ్‌ రేసు నుండి నిష్క్రమించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. అనంత‌రం చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖరి ఓవర్‌కు ముందే మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయినా.. మరో 17 పరుగులు చేస్తే.. ఓడిపోయినా ప్లేఆఫ్‌కు చేరేది. 19 ఓవర్ల తర్వాత.. RCB అర్హత సాధించడానికి 17 పరుగుల లోపు చేయాల్సి ఉండగా.. చెన్నై మ్యాచ్ గెలవడానికి 35 పరుగులు అవసరం. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ యశ్ దయాల్‌పై విశ్వాసం వ్యక్తం చేసి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అతనికి బంతిని అందించాడు. తొలి బంతికి ధోని ఫైన్‌లెగ్‌పై 110 మీటర్ల సిక్సర్‌ కొట్టాడు. దీంతో ఐదు బంతుల్లో 11 పరుగులు అవసరం కాగా.. ఆ తర్వాతి బంతికే స్వప్నిల్ సింగ్ చేతికి చిక్కి ధోని క్యాచ్ ఔట్ అయ్యాడు. త‌ర్వాత‌ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కి వచ్చాడు. మూడో బంతికి పరుగు రాలేదు. మూడు బంతుల్లో 11 పరుగులు కావాలి. నాలుగో బంతికి శార్దూల్ థర్డ్ మ్యాన్ వైపు షాట్ ఆడి పరుగు తీశాడు. ఇప్పుడు చెన్నైకి అర్హత సాధించేందుకు రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా క్రీజులోకి వచ్చాడు. ఓవర్ చివరి రెండు బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయాడు. యష్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి హీరోగా నిలిచాడు.

అయితే.. గత సీజన్ యష్‌కి పీడకలగా మిగిలింది. 2023 సీజన్‌లో యష్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో అతడు ఒకే ఓవర్‌లో 30 పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు చేయాల్సి ఉంది. రింకూ సింగ్ క్రీజులో ఉన్నాడు, ఆ మ్యాచ్‌కు ముందు రింకూ సింగ్‌ సత్తా ఎవరికీ తెలియదు. యష్, రింకూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు ఆడతారు. ఆ మ్యాచ్‌లో యష్ వేసిన ఐదు బంతుల్లో రింకూ ఐదు సిక్సర్లు కొట్టి జట్టును విజయప‌థంలో న‌డిపాడు. ఈ మ్యాచ్ తర్వాత, రింకూ రాత్రికిరాత్రే స్టార్‌గా మారగా.. యష్ మాత్రం విలన్‌గా అవతరించాడు. ఆ ఐదు సిక్సర్ల ఆధారంగానే రింకూ భారత జట్టులో స్థానం సంపాదించి ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు యష్ కెరీర్ ముగిసినట్లు అనిపించింది. ఎందుకంటే రింకు వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత క్రికెట్ నిపుణులతో సహా గుజరాత్ అభిమానులు యష్‌ను తీవ్రంగా విమర్శించారు.

గత ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల వేలంలో గుజరాత్ యశ్ దయాల్‌ను వదిలేసింది. యష్ వేసిన ఆ ఓవర్ కారణంగా జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసినందున గుజరాత్ బహుశా ఈ నిర్ణయం తీసుకుందని అంతా భావించారు. ఈసారి యష్ వేలంలో అమ్ముడుపోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించారు. అయితే RCB వేలంలో 5 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించి యష్‌ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో RCB తీసుకున్న ఈ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే యష్ తన బలమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చాడు. అతనిలో ఎంత సామర్థ్యం ఉందో నిరూపించాడు.

RCB, CSK మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత KKR బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ యశ్ దయాల్ ప్రదర్శనను ప్రశంసించాడు. రింకూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యష్‌ను ప్రశంసిస్తూ ఒక కథనాన్ని పంచుకున్నాడు. రింకూ యష్ ఫోటోను షేర్ చేస్తూ.. 'ఇది దేవుడి ప్లాన్, మిత్రమా' అని క్యాప్షన్ రాశాడు. రింకూ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్‌కేపై యశ్ నాలుగు ఓవర్లలో 42 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

Next Story