టీమ్ఇండియా కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ సహా మొత్తం 6గురు ఆట‌గాళ్ల‌కు కరోనా

Covid strikes India U-19 camp six players ruled out.వెస్టిండీస్ వేదిక‌గా అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ జరుగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2022 4:49 AM GMT
టీమ్ఇండియా కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ సహా మొత్తం 6గురు ఆట‌గాళ్ల‌కు కరోనా

వెస్టిండీస్ వేదిక‌గా అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ జరుగుతోంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత జ‌ట్టు త‌న జైత్ర‌యాత్రను కొన‌సాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో బ‌ల‌మైన ద‌క్షిణాప్రికాను చిత్తు చేసిన యువ భార‌త్ రెండో మ్యాచ్‌లో ప‌సికూ ఐర్లాండ్‌ను ఓ ఆటఆడుకుంది. ఫ‌లితంగా 174 ప‌రుగుల భారీ తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో క్వార్ట‌ర్ ఫైన‌ల్ బెర్త్‌ను టీమ్ఇండియా ఖాయం చేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టులో క‌రోనా క‌ల‌క‌లం రేపింది.

భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మొత్తం ఆరుగురు ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో కీల‌క ఆట‌గాళ్లు దూరం అయినా.. నిశాంత్ సింధు నేతృత్వంలో భార‌త జ‌ట్టు మెరిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 307 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు హ‌ర్నూర్ సింగ్‌(88), ర‌ఘువంశీ(79) అర్థ‌శ‌త‌కాల‌తో మెరువ‌గా.. మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్లు రాజ్ భవ(42), రాజవర్థన్(39), నిశాంత్ సింధూ(36) రాణించ‌డంతో భార‌త్ భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం 308 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ 39 ఓవ‌ర్ల‌లో 133 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ల‌లో సంగ్వాన్‌, అనీశ్వ‌ర్ గౌత‌మ్‌, కౌష‌ల్ తంబే త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. హ‌ర్నూర్ సింగ్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు వ‌చ్చింది.

Next Story