లంచ్‌కు ముందే కుప్ప‌కూలిన ఆసీస్‌.. వికెట్ కోల్పోయిన భార‌త్

Australia all out on 369 runs in First innigs.బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2021 3:39 AM GMT
లంచ్‌కు ముందే కుప్ప‌కూలిన ఆసీస్‌.. వికెట్ కోల్పోయిన భార‌త్

బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 369 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 274/5 తో శ‌నివారం రెండో రోజు ఆట కొన‌సాగించిన ఆసీస్ మ‌రో 95 ప‌రుగులు చేసి మిగిలిన 5 వికెట్ల‌ను కోల్పోయింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్, శార్ధుల్ ఠాకూర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడేసి వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్ ఓ వికెట్ తీశాడు.

274/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను కొన‌సాగించింది. ఓవరనైట్‌ ఆటగాళ్లు టీమ్ పైన్‌, కామెరూన్‌ గ్రీన్‌లు భార‌త బౌలర్ల‌పై ఎదురుదాడికి దిగారు. వీరిద్ద‌రూ ఆరో వికెట్‌కు 111 ప‌రుగుల భాగ‌స్వామం నెల‌కొల్పారు. మ‌రింత ప్ర‌మాద‌కరంగా మారుతున్న ఈ జోడిని శార్దుల్ ఠాకూర్ విడ‌దీశాడు. హాఫ్ సెంచ‌రీ సాధించి మంచి ఊపు మీదున్న ఫైన్.. శార్దుల్ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్ శ‌ర్మ‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లోనే కుదురుకున్న గ్రీన్‌ను సుంద‌ర్ బౌల్డ్ చేశారు. కొద్ది సేప‌టికే ఆసీస్ మ‌రో వికెట్ కోల్పోయింది. క‌మిన్స్ ను శార్దుల్ ఎల్బీగా పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో ఆసీస్ 315 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్పిన్న‌ర్ ల‌య‌న్‌(24), మిచెల్ స్టార్క్‌(20 నాటౌట్‌) వేగంగా ప‌రుగులు చేయ‌డంతో.. ఆస్ట్రేలియా 350 ప‌రుగుల మార్క్‌ను దాటింది. ల‌య‌న్‌ను సుంద‌ర్ బౌల్డ్ చేయ‌గా.. హేజిల్‌వుడ్‌(11) ను న‌ట‌రాజ‌న్ ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భార‌త జ‌ట్టుకు తొలి ఎద‌రుదెబ్బ త‌గిలింది. 11 ప‌రుగుల‌కే తొలి వికెట్ కోల్పోయింది.ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్‌గిల్‌(7) ను ప్యాట్ క‌మిన్స్ బోల్తాకొట్టించాడు. క‌మిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ అందుకోవ‌డంతో.. గిల్ పెవిలియ‌న్ చేరాడు. ప్ర‌స్తుతం క్రీజులో రోహిత్ శ‌ర్మ 13 ప‌రుగుల‌తో, పుజారా 1 ప‌రుగుతో ఆడుతున్నారు. భార‌త్ స్కోర్ 22/‌1.


Next Story