రోహిత్ శర్మను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..!
న్యూజిలాండ్ స్టార్ ఆల్-రౌండర్ అమేలియా కెర్ దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన ఐదవ టీ20లో సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
By - Medi Samrat |
న్యూజిలాండ్ స్టార్ ఆల్-రౌండర్ అమేలియా కెర్ దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన ఐదవ టీ20లో సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆమె ఈ ఘనతతో రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్ల రికార్డులను అధిగమించింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో వరుసగా 11 ఇన్నింగ్స్లలో 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి క్రీడాకారిణిగా (పురుషులు మరియు మహిళలు ఇద్దరూ) అమేలియా కెర్ నిలిచింది.
నాలుగో టీ20ఐ మ్యాచ్లో 31 పరుగులు సాధించడం ద్వారా ఆమె టీ20 అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా అత్యధిక సార్లు 30కి పైగా స్కోర్లు చేసిన రికార్డును నెలకొల్పింది. ఈరోజు ఐదో టీ20ఐ మ్యాచ్లో సెంచరీ సాధించి.. ఈ రికార్డును సాధించిన తొలి క్రీడీకారిణిగా రికార్డు సృష్టించింది.
గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన చమరి అటపట్టు, రొమేనియాకు చెందిన రెబెక్కా బ్లేక్ వరుసగా తొమ్మిది ఇన్నింగ్సులలో 30కి పైగా పరుగులు చేసిన రికార్డును నెలకొల్పారు. టీ20లలో మహమ్మద్ రిజ్వాన్, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మలు వరుసగా ఏడు ఇన్నింగ్స్లలో 30కి పైగా పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఇప్పుడు కెర్ వారందరినీ అధిగమించింది.
వరుసగా 30-ప్లస్ స్కోర్లు ఎక్కువ సార్లు నమోదు చేసిన బ్యాట్స్మెన్
అమేలియా కెర్ - 11 సార్లు
చమరి అటపట్టు - 9 సార్లు
రెబెక్కా బ్లేక్ - 9 సార్లు
రోహిత్ శర్మ - 7 సార్లు
అభిషేక్ శర్మ - 7 సార్లు
అమేలియా కెర్ తన చివరి 11 ఇన్నింగ్స్లలో 140 స్ట్రైక్ రేట్తో 669 పరుగులు సాధించింది. ఆమె బంతితో కూడా అద్భుతంగా రాణించి 12 వికెట్లు పడగొట్టింది. ఇటీవల, పూర్తి ఐసీసీ సభ్య దేశాలలో మహిళల టీ20లలో 1,000 పరుగులు, 100 వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన క్రీడాకారిణిగా కెర్ నిలిచింది.
ఐదవ టీ20లో అమేలియా కెర్ ప్రదర్శన కారణంగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా దక్షిణాఫ్రికా కేవలం 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు చివరి టీ20ని 92 పరుగుల తేడాతో గెలిచి, ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది.