వైభవోపేతంగా స్నాతకోత్సవ వేడుకను నిర్వహించిన ఐఎంటి హైదరాబాద్

ఐఎంటి హైదరాబాద్ తమ 2023-2025 బ్యాచ్ కోసం స్నాతకోత్సవ వేడుకను తమ క్యాంపస్‌లో నిర్వహించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 23 Nov 2025 7:27 PM IST

వైభవోపేతంగా స్నాతకోత్సవ వేడుకను నిర్వహించిన ఐఎంటి హైదరాబాద్

ఐఎంటి హైదరాబాద్ తమ 2023-2025 బ్యాచ్ కోసం స్నాతకోత్సవ వేడుకను తమ క్యాంపస్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వోల్వో గ్రూప్ ఇండియా అధ్యక్షుడు & మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి పాల్గొనగా ఐఎంటి హైదరాబాద్ పిజిపి చైర్‌పర్సన్ ప్రొఫెసర్ (డాక్టర్) స్టీవెన్ రాజ్ పడకండ్ల , ఐఎంటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) కె ఎం బహరుల్ ఇస్లాం, తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ (డాక్టర్) కె ఎం బహరుల్ ఇస్లాం , ముఖ్య అతిథి కమల్ బాలి ఐఎంటి హైదరాబాద్ యొక్క కొత్త సీఎస్ఆర్ కార్యక్రమం 'దైత్వ'ను పరిచయం చేయటంతో పాటుగా లోగోను ఆవిష్కరించారు. అనంతరం 2023-25 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ కోసం కాన్వొకేషన్ సావనీర్‌లను విడుదల చేశారు.

ప్రొఫెసర్ (డాక్టర్) కె.ఎం. బహరుల్ ఇస్లాం వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలను పంచుకున్నారు. బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, పెప్సికో, డెలాయిట్ మరియు మైక్రాన్ టెక్నాలజీ వంటి 120 కి పైగా ప్రతిష్టాత్మక కంపెనీలలో తమ విద్యార్థులు నియమించబడ్డారని చెప్పారు.

ఐఎంటి హైదరాబాద్ యొక్క చీఫ్ మెంటర్ కమల్ నాథ్ 2025 గ్రాడ్యుయేటింగ్ తరగతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్సుకత, వినయం, అనుసంధానం, బాధ్యత యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు నొక్కిచెప్పారు.

ముఖ్య అతిథి కమల్ బాలి మాట్లాడుతూ వాతావరణ మార్పు, డిజిటల్ పరివర్తన, పెరుగుతున్న జాతీయవాదం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సహా సంక్లిష్టమైన ప్రపంచ సవాళ్లను గురించి వెల్లడించారు. ఆవిష్కరణ, పారదర్శకత, కలుపుగోలుతనం , స్థిరత్వాన్ని స్వీకరించడం ద్వారా ఉద్యోగ సృష్టి, పట్టణ-గ్రామీణ సమతుల్యత, పారిశ్రామిక అభివృద్ధి వంటి జాతీయ ఆవశ్యకతలను పరిష్కరించాలని ఆయన గ్రాడ్యుయేట్లను కోరారు. తమ లక్ష్యాలను అభిరుచితో అనుసంధానించుకోవాలని, సహకారాన్ని, సానుకూలతను పెంపొందించుకోవాలని, అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో చురుకైన అభ్యాసకులుగా ఉండాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు.

2023-2025 బ్యాచ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 4 బంగారు పతకాలు, 3 వెండి పతకాలను ప్రదానం చేశారు.

Next Story