తల్లికి ఊహించని షాకిచ్చిన కొడుకు.. సరుకుల కోసం వెళ్లి ఏకంగా..
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 April 2020 6:15 AM GMTకరోనా విజృంభణతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్లో అందరూ ఇంటిపట్టున ఉంటారు.. తద్వారా వైరస్ వ్యాప్తి తగ్గుతుంది అన్న కోణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే.. కొందరు చేసే పనులు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి షాపుకెళ్లి సామాన్లు తీసుకురమ్మంటే.. ఏకంగా జీవిత భాగస్వామిని చేసుకొచ్చాడు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది.
వివరాళ్లోకెళితే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లోని సహీదాబాద్కు చెందిన గుడ్డు.. రెండు నెలల క్రితం సవితా అనే యువతిని హరిద్వార్లో ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే.. ఆ పెళ్లికి ప్రత్యక్ష సాక్ష్యులు లేక మ్యారేజ్ సర్టిఫికెట్ దక్కలేదు. అంతలోనే లాక్డౌన్ కూడా వచ్చేసింది. ఈ విషయం ఇంట్లో చెప్పని గుడ్డు.. అతను సహీదాబాద్లోని స్వగృహంలోనే ఉంటూ.. తన భార్యను ఢిల్లీలోని ఓ అద్దె ఇంట్లో ఉంచాడు.
అయితే.. గుడ్డు భార్య ఇంటి యజమానులు మాత్రం.. ఆమెను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమెను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతని తల్లి కిరాణ వస్తువులు తీసుకురమ్మని గుడ్డును బయటకు పంపగా.. ఇదే అదునుగా భావించి బయటకు వెళ్లిన కాసేపటికే ఇంటిముందు భార్యతో సహా ప్రత్యక్షమయ్యాడు.
ఇంటిముందు ప్రత్యక్షమయిన కొడుకు, కోడలిని చూసిన గుడ్డు తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. వారిని ఇంటిలోకి అనుమతించలేదు. పోలీసులు చేసేదేంలేక.. ఢిల్లీలోని సవిత ఇంటి యజమానులతో మాట్లాడి.. పోలీసులు ఈ జంటను లాక్డౌన్ ముగిసేవరకు అక్కడే ఉండేందుకు అనుమతించాలన్నారు. దీనికి ఇంటి యజమాని కడా అంగీకరించడంతో కథ సుఖాంతమయ్యింది.