సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కనిపించింది.. మళ్లీ అదృశ్యం..!

By అంజి  Published on  6 Jan 2020 7:29 AM GMT
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కనిపించింది.. మళ్లీ అదృశ్యం..!

హైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యమైంది. పదకొండు రోజులుగా రోహిత(36) కనిపించడంలేదు. డిసెంబర్‌ 26న మధ్యాహ్నం 3 గంటలకు బయటకు వెళ్లిన రోహిత తిరిగి ఇంటికి రాలేదు. రోహిత్‌ మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌ అయ్యింది. దీంతో రోహిత తమ్ముడు పరిక్షిత్‌ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త అభిషేక్‌తో విభేదాల కారణంగా రోహిత ఒంటరిగా జీవిస్తోంది. గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌లో ఉంటున్న రోహిత ఆచూకీ ఇంత వరకు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రోహిత తల్లిదండ్రులు చాదర్‌ఘాట్‌లో ఉంటుండగా, భర్త అభిషేక్‌ ఎల్బీనగర్‌లో ఉంటూ ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్‌లోని ఆపిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో గత రెండు సంవత్సరాల నుంచి రోహిత్‌ ఉద్యోగం చేస్తోంది. కాగా ఆదివారం నాడు రోహిత సికింద్రాబాద్‌లో కనిపించినట్టుగా పోలీసులు సమాచారం అందడంతో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు. రోహిత ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

తెలంగాణలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క నగరాల్లోనే ఒక్కో రోజు పదుల సంఖ్యలో అదృశ్యం అవుతున్నారు. చదువులు, ప్రేమలు, ఆర్థిక ఇబ్బందులే అదృశ్యానికి కారణంగా తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లినా కొద్ది రోజుల్లోనే కొందరు తిరిగి వచ్చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే కొందరు ఇల్లు వదిలి పరార్‌ అవుతున్నారు. అయితే మిస్సింగ్‌ కేసులపై పోలీసులు మాత్రం అంతంతమాత్రంగానే స్పందిస్తున్నారు.

Next Story