అమెరికాలో కాల్పుల కల్లోలం.. ఆరుగురు మృతి

By అంజి
Published on : 27 Feb 2020 8:27 AM IST

అమెరికాలో కాల్పుల కల్లోలం.. ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. ఓ 50 ఏళ్ల వ్యక్తి మెల్సన్‌ కూర్స్‌ కంపెనీలోకి చొరబడి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆ తర్వాత నిందితుడు తనకు తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం మిల్‌వాకీ నగరంలోని మెల్సన్‌ కూర్స్‌ బీర్ల కంపెనీలో జరిగింది. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి.. గతంలో అదే కంపెనీలో మాజీ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు.

Shooting at Molson Coors company

నిందితుడిని గతంలో కొన్ని కారణాల వల్ల ఉద్యోగం నుంచి ఆ సంస్థ యాజమాన్యం తొలగించినట్లు సమాచారం. ఆ సంస్థలో పని చేసే వేరే ఉద్యోగి ఐడీ కార్డు దొంగిలించి నిందితుడు కంపెనీలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారని మిల్‌వాకీ మేయర్‌ టామ్‌ బారట్‌ తెలిపారు. ఉద్యోగం నుంచి పోయిందన్న కారణంతోనే నిందితుడు కాల్పులు జరిపాడని అక్కడి అధికారులు భావిస్తున్నారు.



ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్పందించారు. ఓ సమావేశంలో మాట్లాడుతున్న ఆయన.. కాల్పుల ఘటనలో ఐదుగురు తమ ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాల్పులు జరిగిన సమయంలో కంపెనీ కాంప్లెక్స్‌లో సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నారు.

Next Story