సిటీ బస్సుల్లో రైతుబజార్లు..
By అంజి Published on 3 April 2020 8:05 AM ISTముఖ్యాంశాలు
- వీఎంసీ పరిధిలో మొత్తం 64 డివిజన్లు
- రైతు బజార్లకు వేదికలవుతున్న ఆర్టీసీ బస్సులు
- రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్టీసీ సంచార రైతు బజార్లు
విజయవాడ: లాక్డౌన్లో భాగంగా ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు దొరక్క ప్రజలు నానా ఇబ్బందులకు గురువుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ సరికొత్త ఆలోచన చేశారు. ప్రజల ఇళ్ల వద్దకే రైతు బజార్లను తీసుకెళ్లేలా ప్రతిపాదన చేశారు. కూరగాయలను వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులతో సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ సిద్ధమవుతున్నారు.
Also Read: ఏపీని వణికిస్తున్న కరోనా.. 152కు చేరిన కేసులు
గురువారం రోజున ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని ప్రయోగ ప్రతిపాదికన నగర వీధుల్లో తిప్పారు. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 53 డివిజన్లను కలుషిత ప్రాంతాలుగా ప్రకటించారు. వీరి ఇళ్ల వద్దకే నేరుగా సంచార రైతు బజార్లు వెళ్లడం ద్వారా ఇబ్బంది పడకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రజలు ఒకే చోట గుమికూడాల్సిన పని కూడా తప్పుతుంది. సంచార రైతు బజార్లకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ ఆర్ఎం నాగేంద్రప్రసాద్తో మున్సిపల్ కమిషనర్ చర్చించారు. రైతు బజార్ల నిర్వహణ కోసం తొలి విడతగా ఐదు సిటీ బస్సులను ఇవ్వాలని కోరారు. ప్రయోగాత్మకంగా నగరంలోని శివాలయం సెంటర్, ఊర్మిళ సుబ్బారావ్నగర్లో పెట్టారు.