ముందుంది 'రెవెన్యూ' గండమేనా.?
By Medi Samrat Published on 13 Oct 2019 2:30 PM GMT- ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన రెవెన్యూ సంఘాలు
విధి నిర్వహణలో అసువులుబాసిన రెవెన్యూ ఉద్యోగుల సంతాప సభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. చనిపోయిన రెవెన్యూ ఉద్యోగులకు అన్ని రెవెన్యూ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిందని, దీంతో అనేక మంది ఉద్యోగులు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడిల కారణంగా మరణించారని పేర్కొన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా తాము రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. తమ శ్రమ వల్లే 58 లక్షల మంది రైతులకు భూరికార్డుల ప్రక్షాళన చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని చెప్పారు.
రెవెన్యూ ఉద్యోగులంతా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని, వాటిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ శాఖకు హెచ్ఓడీ లేరని, మంత్రి లేరని, ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. తాము ఒకప్పుడు కేసీఆర్ ని ఉద్యమ నేతగా, ఆయన సూచనలు పాటిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించామని చెప్పారు. ఇప్పుడు ఉద్యమ నేతనే ముఖ్యమంత్రిగా ఉన్నా తమ సమస్యలు పరిష్కారం కాకపోగా, సమస్యలను పంచుకోవద్దు, ప్రశ్నించవద్దు అనేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు.
రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవడానికి ఐక్య పోరాటానికి రెవెన్యూ సంఘాలన్నీ సిద్ధం కావాలని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయడానికి జరుగుతున్న కుట్రలను భగ్నం చేస్తామన్నారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర భూసర్వే జరిపించాలన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి కోరారు. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఉద్యమించాలని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు రెవెన్యూ ఉద్యోగుల మద్దతు ఉంటుందన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏడు రెవెన్యూ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను అర్థం చేసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సకల జనుల సమ్మె విజయవంతం కావడంలో ఆర్టీసీ కార్మికులదే కీలక పాత్ర అని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూస్తుంటే మనస్సు కలిచి వేస్తోందని, వారికి రెవెన్యూ ఉద్యోగులుగా అండగా ఉంటామని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఆర్వోఏ ప్రధాన కార్యదర్శి సుధాకర్, టీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..
- కొత్త చట్టం రూపకల్పనలో రెవెన్యూ ఉద్యోగుల సలహాలు తీసుకోవాలి.
- రెవెన్యూ వ్యవస్థను ఇతర శాఖల్లో విలీనం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలి.
- కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టూ సర్వ్ పేరుతో వివిధ జిల్లాలకు బదిలీ చేసిన ఉద్యోగులను వెంటనే వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలి.
- ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహశీల్దార్లను పాత జిల్లాలకు బదిలీ చేయాలి.
- కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు తగ్గట్లుగా సిబ్బంది నియామకం జరపాలి.
- ఖాళీలను వెంటనే భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలి.
- రెవెన్యూ ఉద్యోగులకు చట్టాలు, విధులపై శిక్షణ ఇప్పించాలి. ఇందుకోసం అకాడమీ ఏర్పాటు చేయాలి.
- సమగ్ర భూసర్వే జరిపి పూర్తిగా భూసమస్యలను పరిష్కరించాలి.
- లోపభూయిష్టమైన సాఫ్ట్వేర్లో మార్పులు జరిపించాలి.
ఇది కూడా చదవండి:
https://telugu.newsmeter.in/tsrtc-hyderabad-employee-suicide/
ఇది కూడా చదవండి:
https://telugu.newsmeter.in/tsrtc-hyderabad-employee-suicide/