క‌రోనాపై పోరుకు విరాళం ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ అధినేత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2020 5:55 AM GMT
క‌రోనాపై పోరుకు విరాళం ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ అధినేత‌

దేశమంతా కరోనా భయంతో వణికిపోతున్న సమయంలో రిలయన్స్ సంస్థ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థల్లో పని చేసే కాంట్రాక్టు, టెంపరరీ వర్కర్స్ అందరికి జీతాలు, వేతనాలు చెల్లిస్తామని.. కరోనా వైరస్ సృష్టించిన ఈ క్రైసిస్ లో ఉద్యోగులు విధి నిర్వహణకు రాకపోయినా కూడా వారికి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. అంతే కాదు దేశంలోని పలు నగరాలలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

ప్రాణాంతక కరోనా నుంచి ఎలా అయినా దేశం బయటపడాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో పాలుపంచుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ కోవలో వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూడా చేరారు. కరోనా బాధితులను తరలించేందుకు, వారి చికిత్సకు అవసరం అయ్యే పరికరాల తరలింపునకు వినియోగించే వాహనాలు దేశంలోని అన్ని రిలయన్స్ ఫ్యూయల్ స్టేషన్లలో ఉచితంగా ఫ్యూయల్ నింపుతామని ప్రకటించారు.అదే సమయంలో ముఖానికి ధరించే మాస్కుల తయారీని మార్చ్ 24 నుంచి పెంచుతామని, ఒక్కో రోజుకు లక్ష మేరకు అదనంగా మాస్కులను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ రిటైల్, జియో, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫ్యామిలీలోని మొత్తం 6,00,000 మంది సభ్యుల సమగ్ర బలాన్ని కరోనా వైరస్‌పై పోరు కోసం ఉపయోగించుకుంటున్నట్టు వివరించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని లోధివాలిలో పూర్తిస్థాయి ఐసోలేషన్ కేంద్రాన్ని నిర్మించి జిల్లా అధికారులకు అప్పగించింది రిలయన్స్.

Next Story