చరిత్రలో నిలిచిపోనున్న మార్చి 26, 2020
By తోట వంశీ కుమార్ Published on 15 April 2020 5:37 AM GMTమార్చి26, 2020 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఓ రికార్డు డే గా మిగిలిపోనుంది. ఎందుకంటారా..? లాక్డౌన్ కారణంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లలో ఉన్నందుకని భావిస్తున్నారా..? కాదండోయ్.. ఆరోజు రాష్ట్రంలో ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగలేదట. ఈ విషయాన్ని తాజాగా రోడ్డు సేఫ్టీ విభాగం అధికారులు వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మే3 వరకు లాక్డౌన్ను విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో రోడ్డు పైకి వచ్చే వాహానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ప్రమాదాలు కూడా తగ్గాయి. రోడ్ సేఫ్టీ అధికారులు తాజాగా గణాంకాలను విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు 60 ప్రమాదలు జరుగుతుండగా.. 19 మంది మృతవాత పడుతుండగా.. 80 మందికి గాయాలవు ఉండేవి. గత సంవత్సరం 2019లో రోడ్డు ప్రమాదాల్లో 6,964 మంది మరణించారు. 2019 మార్చి 22 నుంచి 31 వరకు 52 మంది మృత్యువాత పడగా.. ఏప్రిల్ 7 వరకు 23 మంది చనిపోయారు. కాగా ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా వాహానాలు రోడ్లపైకి పెద్దగా రావడం లేదు. దీంతో ఈ ఏడాది మార్చి 26న ఒక్క మరణమూ సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇది ఒక రికార్డు అని అధికారులు స్పష్టం చేశారు. సాధారణ సగటుతో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య 4కు పడిపోయిందన్నారు. ఈ మరణాలు కూడా మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో జరిగిన ప్రమాదాలేనన్నారు.