రా ఏజెంట్ ను అరెస్ట్ చేసామంటున్న పాకిస్థాన్..!

By సుభాష్  Published on  16 July 2020 4:54 AM GMT
రా ఏజెంట్ ను అరెస్ట్ చేసామంటున్న పాకిస్థాన్..!

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్.ఐ.ఏ) ఓ ప్రభుత్వ ఉద్యోగిని బుధవారం నాడు అరెస్ట్ చేసింది. అతడు ఒక 'రా' ఏజెంట్ అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. దక్షిణ పోర్ట్ సిటీ కరాచీలో అతడు కొందరిని చంపడానికి, బాంబు దాడికి పాల్పడాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లు పాక్ అధికారులు చెబుతున్నారు.

అనుమానితుడైన జాఫర్ ఖాన్.. కరాచీ ఫైర్ బ్రిగేడ్ లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. జాఫర్ ఖాన్ 14 నెలల పాటూ భారత్ లో ట్రైనింగ్ తీసుకున్నాడని.. బాంబులను తయారీ చేయడం, ఆయుధాలను ఎలా వాడాలో మొత్తం నేర్చుకున్నాడని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అఫీషియల్స్ ఆరోపిస్తూ ఉన్నారు.

డబ్బులు మార్పిడి చేసే సంస్థకు చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. రా స్లీపర్ సెల్ తో వారికి సంబంధం ఉందనే ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారికి సహాయం చేస్తున్నారని, హవాలా, హుండీ ద్వారా డబ్బులను రా ఏజెంట్లకు చేరవేస్తూ ఉన్నారని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీనియర్ అధికారి తెలిపారు.

మిగిలిన వారి సమాచారం అన్ని ఎయిర్ పోర్ట్స్ కు పంపినట్లు అధికారులు తెలిపారు. తుపాకులు, లాప్ టాప్ లు, ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అనుమానితుల మీద కేసు రిజిస్టర్ చేశామని.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అన్నారు.

Next Story