మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

By సుభాష్  Published on  14 March 2020 5:48 AM GMT
మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ రోజు తమిళనాడులో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, తాజాగా రాజస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బోధ్‌పూర్‌ జిల్లాలో ఓ జీపును ట్రక్కు ఢీకొనడంతో 11 మంది మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బలోత్రా-ఫలోడీ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా వచ్చిన ట్రక్కు జీపును ఢీకొట్టడంతో ముందు భాగంలోకి వాహనం చొచ్చుకొచ్చింది.

ప్రమాదం జరిగిన వెంటనే జీపు మొత్తం ట్రక్కు కింద ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, గత ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లో ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బస్సు కుటుంబ సభ్యులతో ఓ పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.



Next Story