వానొస్తే అంతే.. రాజధానిలో కార్లు డ్రైవర్లు లేకుండా ప్రయాణిస్తాయ్..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Oct 2020 10:54 AM GMTమూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజధాని హైద్రాబాద్ అల్లాడుతోంది. నాలాలు పొంగిపొర్లుతూ పలు కాలనీలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. వరద ఉదృతికి పెద్ద పెద్ద వాహనాలతో పాటు కార్లు కొట్టుకుపోతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో జన జీవనం స్తంభించింది.
ఇదిలావుంటే.. వరద ప్రవాహానికి సికింద్రాబాద్లోని ఓ అపార్ట్మెంట్ కింద పార్క్ చేసిన కారుపైకి వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన మరో కారు వచ్చి చేరింది. ఇంతలోనే మరో కారు వరదలో కొట్టుకుంటూ వచ్చి ఆ రెండు కార్లను ఢీకొట్టిన దృశ్యాలు వరద భీభత్సానికి అద్దం పడుతోంది. కారులో డ్రైవర్ లేకున్నా అత్యంత వేగంగా వాహనాలు కదులుతూ కనిపిస్తుండటంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. పలు అపార్ట్మెంట్ సెల్లార్లోకి సైతం భారీగా వరద నీరు రావడంతో వాహనాలన్నీ కొట్టుకుపోతున్నాయి. భారీ వాహనాలు సైతం నీళ్లలో తేలుతూ కొట్టుకుపోతున్నాయి.
ఇక హైదరాబాద్లో ఇప్పటివరకు మొత్తంగా 32 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వరద నీటి ఉధృతి అంతకంతకు పెరిగిపోతుండటంతో మూసీగేట్, హుసేన్ సాగర్ నాలుగో గేట్ను తెరిచారు. ఈ నేపథ్యంలో అశోక్నగర్, హిమాయత్నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు.
ఇప్పటికే.. వర్ష బీభత్సానికి తెలంగాణలో దాదాపు 15 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించడంతో.. ఈ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.