నేటి నుండే పబ్జీ పూర్తిగా బ్యాన్..!
By న్యూస్మీటర్ తెలుగు
దేశంలో పబ్ జి మొబైల్ గేమ్పై నేటి నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ అయిన భారత్ లో పబ్ జి గేమ్ ను నిషేధించారు. పబ్ జితో పాటు చైనాకు చెందిన 100 యాప్ లను సర్కారు గతంలో నిషేధించింది. జూన్ నెలలో టిక్ టాక్ తోపాటు ఇతర చైనా యాప్ లను భారత్ నిషేధించింది.
భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే అనువర్తనాలను ఐటీ మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. సైబర్ సెక్యూరిటీ సమస్యలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పబ్ జి గేమ్ ను అక్టోబరు 30 వతేదీ నుంచి దేశంలో నిలిపివేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించబడింది. అయినప్పటికీ తమ తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్జీని ఆడుకోవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. ఇక ఈ గేమ్ పిల్లలపై చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గతంలో కొందరు పిల్లలు ఆత్మహత్యలు సైతం చేసుకున్న నేఫథ్యంలో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది.