వైసీపీని వీడే యోచనలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది.

By అంజి  Published on  26 Dec 2023 6:16 AM GMT
MLAs, Kakinada district, YCP, APnews

వైసీపీని వీడే యోచనలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికారం చేపట్టడమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఈ సారి వైసీపీని ఎలాగైన ఓడించాలని చంద్రబాబు, పవన్‌ చేతులు కలిపారు. ఉమ్మడిగా ముందుకెళ్తున్నారు. వైసీపీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక ఎన్నికల వేళ.. నాయకులు పార్టీలు మారడం సాధారణ విషయం. ప్రస్తుతం ఏపీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు బై చెప్పారు. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ వైసీపీ నుంచి వెళ్లిపోయారు. ఇటీవల ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

గెలుపు అవకాశాలు లేవన్న సర్వే నివేదికల ఆధారంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిక్కెట్‌ నిరాకరించడంతో పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాకినాడ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు - ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులు ఈ సారి వైసీపీ టికెట్‌ రాదన్న కారణంతో ఒకట్రెండు రోజుల్లో కంచె దూకేందుకు సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం నడుస్తోంది. వైఎస్సార్‌సీపీలో తమకు భవిష్యత్తు లేదని గ్రహించిన వీరిలో ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరే యోచనలో ఉండగా, మూడో వ్యక్తి జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

తాను పార్టీ ఫిరాయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చంటిబాబు టీడీపీలోకి ఫీలర్లు పంపడం ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాంటి టికెట్ ఆశించకుండా బేషరతుగా టీడీపీలో చేరేందుకు సిద్ధమని టీడీపీ నాయకత్వానికి తెలిపారని, గ్రీన్ సిగ్నల్ లభిస్తే జనవరి 5న టీడీపీలోకి ఫిరాయించనున్నారని సమాచారం. చంటి బాబు మొదట టీడీపీలో ఉండి 2009, 2014లో జగ్గంపేట నుంచి పోటీ చేసి విఫలమయ్యారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి విజయం సాధించారు. ఇప్పుడు 2004, 2009లో తాను ప్రాతినిధ్యం వహించిన జగ్గంపేట నుంచి మాజీ మంత్రి, ఎంపీ తోట నరసింహంను పోటీకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ప్రత్తిపాడుకు చెందిన మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్‌ కూడా టీడీపీలోకి ఫిరాయించాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానిక టీడీపీ నేతల ద్వారా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలోకి ఫిరాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, టీడీపీతో సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా ఆయన హైదరాబాద్‌లో క్యాంప్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌ని కలవడానికి, పిఠాపురం నుంచి పార్టీ టికెట్ కోసం లాబీయింగ్‌ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Next Story