వైఎస్ఆర్‌టీపీలో క‌మిటీల‌న్నీ ర‌ద్దు.. ష‌ర్మిల సంచ‌ల‌న నిర్ణ‌యం

Sharmila cancelled all commitees in YSRTP.తెలంగాణ రాష్ట్రంలో మ‌రో సంవ‌త్స‌రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2022 5:55 AM GMT
వైఎస్ఆర్‌టీపీలో క‌మిటీల‌న్నీ ర‌ద్దు.. ష‌ర్మిల సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో సంవ‌త్స‌రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల‌నే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉన్న అన్ని క‌మిటీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌మిటీల స్థానంలో జిల్లాల‌ల‌కు కో-ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రస్తుతం ష‌ర్మిల తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త సంవ‌త్స‌రం పార్టీని ప్ర‌క‌టించిన త‌రువా పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కో ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు. అంతేకాదు.. రాష్ట్ర స్థాయిలో అధికార ప్ర‌తినిధుల‌ను, సోష‌ల్ మీడియా ఇన్‌చార్జీల‌ను నియ‌మించారు. అయితే.. తాజాగా వాట‌న్నింటినీ ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. క‌మిటీల ర‌ద్దు త‌రువాత కొత్త‌గా నియ‌మించిన కోఆర్డినేట‌ర్ల విష‌యానికి వ‌స్తే.. గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్‌గా వడుక రాజగోపాల్, ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్‌గా గడిపల్లి కవిత, రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్‌గా ఎడమ మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్‌గా తమ్మాలి బాలరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కో ఆర్డినేటర్‌గా మహమ్మద్ అత్తార్ ఖాన్, నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్‌గా ఇంజం నర్సిరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నాడెం శాంతికుమార్, ములుగు జిల్లా కో ఆర్డినేటర్‌గా రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కో ఆర్డినేటర్‌గా అప్పం కిషన్, నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నీలం రమేశ్, ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్‌గా బెజ్జంకి అనిల్ కుమార్‌ను త‌దిత‌రుల‌ను నియ‌మించారు.

ఓటుతోనే మార్పు సాధ్యం.. షర్మిల

ఓటుతోనే మార్పు సాధ్యమ‌ని, మెరుగైన స‌మాజ నిర్మాణానికి ఓటే వ‌జ్రాయుధని వైఎస్ ష‌ర్మిల తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఆమె సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. 'ఓటుతోనే మార్పు సాధ్యం.మెరుగైన స‌మాజ నిర్మాణానికి ఓటే వ‌జ్రాయుధం.అవినీతి, అక్ర‌మాలు అంతం కావాల‌న్నా.. నియంత‌, నిరంకుశ పాల‌న పోవాలన్నా ఓటు హ‌క్కు విధిగా ఉప‌యోగించుకోవాలి. నిస్వార్థంగా ఓటు వేద్దాం.. మన బ‌తుకులు మార్చుకుందాం.'అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.


భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజైన జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Next Story