కుప్పం ఎన్నికల తర్వాత ఆ ఇద్దరికి రాసుకోడానికి చరిత్ర, చూసుకోడానికి భవిష్యత్ ఉండదు : రోజా
Roja Fires On TDP Leaders. వైసీపీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన
By Medi Samrat Published on 13 Nov 2021 11:35 AM GMT
వైసీపీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై ఫైర్ అయ్యారు. లోకేష్ కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన లోకేష్ వీధి రౌడిలా మాట్లాడుతున్నాడని.. వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నా ఇంకా లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నారా కుటుంబం ఎవ్వరూ కుప్పంను పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ జగన్ కుప్పం కష్టాన్ని పట్టించుకున్నారని అన్నారు.
చంద్రబాబు, జగన్ పాలనను కుప్పం వాసులు బేరీజు వేసుకుంటున్నారని.. జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకోవడం వల్ల అన్ని ఎన్నికల్లో వారికి ఓటమి పాలయ్యారని విమర్శించారు. రాబోయే కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను ప్రజలు తరిమికొడతారని రోజా విమర్శించారు. చంద్రబాబు, లోకేష్లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని.. డబ్బులు, మద్యం, క్యాంప్ రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. కుప్పం ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పనున్నారని రోజా అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని ఆటలాడినా కుప్పం ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదన్నారు. కుప్పం ఎన్నికల తర్వాత ఇద్దరికి రాసుకోడానికి చరిత్ర, చూసుకోడానికి భవిష్యత్ ఉండదని రోజా విమర్శించారు.