తెలంగాణలో బీజేపీ జోష్‌కు కారణం బండి సంజయ్: రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణలో బీజేపీ జోష్‌కు కారణం బండి సంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  21 July 2023 11:44 AM GMT
Komatireddy Rajagopal Reddy, Bandi Sanjay, BJP,

తెలంగాణలో బీజేపీ జోష్‌కు కారణం బండి సంజయ్: రాజగోపాల్‌రెడ్డి

బండి సంజయ్‌ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ బీజేపీ ఎంతో జోష్‌గా పని చేసిందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడి పని చేశారని చెప్పారు. ఆయన్ని అందరం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని అన్నారు. అయితే.. బండి సంజయ్‌ని చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని.. ఆ సమయంలో ఏడుపుని ఆపుకోలేక బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కి ఒక విషయం తప్పకుండా చెప్పాలని అన్నారు. అన్నను చూడగానే తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి జోష్‌ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బండి సంజయ్‌ మాత్రమే అని చెప్పారు. బండి సంజయ్‌ని చూస్తే రాజీలేని పోరాటం, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపినవే గుర్తొస్తాయి. దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బండి సంజయ్‌ తన వంతుగా చాలా కష్టపడి పని చేశారు. మునుగోడులో నైతిక విజయం సాధించామంటే అది కూడా బండి సంజయ్‌ నాయకత్వంలోనే అన్ని చెప్పారు.

రాష్ట్రంలో బీజేపీని బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఘతన బండి సంజయ్‌కే దక్కుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలంతా కమలం పార్టీ వైపు చూడటంలో బండి సంజయ్ పాత్ర ప్రధానమైనదని చెప్పారు. అయితే అందరూ పార్టీ అధిష్టానం నిర్ణయాలను గౌరవించాలని.. ఆ మేరకే నడుచుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ని మాత్రం మనం గుండెల్లో పెట్టుకుని చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుందామని అన్నారు.

కాగా.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తాను పదే పదే పార్టీలు మారే వ్యక్తిని కాదని చెప్పారు. తాను ఇంతకు ముందు పార్టీ మారింది బీఆర్ఎస్‌ను గద్దె దించడం కోసమే అని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడనని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. కిషన్‌రెడ్డి నాయకత్వంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పారు.

Next Story