కేఆర్పీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి

కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తన సొంతుగూటికి చేరుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  25 March 2024 6:07 AM GMT
karnataka, gali janardhan reddy, bjp,

కేఆర్పీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల వేళ అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో తలామునకలయ్యారు. ఇక ఎన్నికల్లో ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టారు. ఎన్డీఏ, ఇండియా కూటములు ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక పాలిటిక్స్‌లో మరో సంచలనం జరిగింది.

కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తన సొంతుగూటికి చేరుకున్నారు. ఇప్పటి వరకు కల్యాణ రాజ్య ప్రతగి పక్ష పార్టీని నడిపిన ఆయన.. తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకుని.. సొంత గూటికి చేరారు. కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప సమక్షంలో గాలి జనార్ధన్‌రెడ్డి బీజేపీ కండువాను కప్పుకున్నారు. గాలి జనార్ధన్‌రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరారు.

సొంత గూటికి చేరుకున్న తర్వాత గాలి జనార్ధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని చెప్పారు. బీజేపీలో చేరడం తన సొంత గూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తన వంతు పనిచేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరాననీ.. తనకు ఎలాంటి పదవులు కూడా అవసరం లేదని మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఇక యెడియూరప్ప స్పందిస్తూ.. గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన భార్యకు బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. గాలి జనార్ధన్‌రెడ్డి బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. గాలి జనార్ధర్‌రెడ్డి బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం వచ్చినట్లు అయ్యిందన్నారు. ఇక కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకుంటామన్నారు. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని మాజీ సీఎం యెడియూరప్ప దీమా వ్యక్తం చేశారు.

Next Story