కేసీఆర్.. ప్రమాణం చేసేందుకు ఎందుకు రాలేదు
Bandi Sanjay Fires On CM KCR .. అబద్దాలను వాస్తవాలనుగా చిత్రీకరించేందుకు టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలు
By సుభాష్ Published on 21 Nov 2020 4:31 PM IST
అబద్దాలను వాస్తవాలనుగా చిత్రీకరించేందుకు టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. వరద సాయం నిలిపివేతపై ఈసీకి తాను లేఖ రాసినట్లు చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేసేందుకు పిలిస్తే ఎందుకు రాలేదని బండి సంజయ్ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. భాగ్యలక్ష్మీ దేవాలయంలో కాకపోయినా పక్కనే ఉన్న మసీదులో ప్రమాణం చేసి ఉంటే బాగుండేదన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే గతంలో రూ.10 వేలు పొందిన వరద బాధితులకు అదనంగా ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. నగరంలోని హిందువులను వెళ్లగొట్టడమే టీఆర్ఎస్, మజ్లిస్ లక్ష్యమా..? రోహింగ్యాల విషయంలో మీరు మాట్లాడినప్పుడు 80 శాతం ఉన్న హిందువుల గురించి మేం మాట్లాడితే తప్పా.. 25 స్థానాలు గెలిచి మేయర్ అవుతామని టీఆర్ఎస్కు చెందిన మంత్రే అన్నారు టీఆర్ఎస్కు 25కు మించి సీట్లు రావని సర్వేలు చెబుతున్నాయి అని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఉన్నవాళ్లనే కాపాడుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ మేనిఫెస్టోను త్వరలోనే కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ విడుదల చేస్తారని సంజయ్ పేర్కొన్నారు.