సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్ జరిగింది: బండి సంజయ్

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 May 2024 9:00 AM GMT
bandi sanjay, comments,  phone tapping, telangana,

సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్ జరిగింది: బండి సంజయ్

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌ విషయాన్ని లేవనెత్తారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అరెస్ట్‌లు, రిమాండ్‌లు అన్నీ జరిగాయని అన్నారు. తీవ్రమైన ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేశారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ కేసులో భాగంగా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనీ. కరీంనగర్ మంత్రి హస్తం కూడా ఉందంటూ బండి సంజయ్ ఆరోపణలు చేశారు.

పెద్దల ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు చెప్పారని బండి సంజయ్ అన్నారు. అనేక ఆరోపణలపై సిట్‌ వేయడం.. ఆ తర్వాత వాటిని మూసివేయడం సాధరణంగా మారిపోయిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజానిజాలు తేలి దోషులకు శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఎంతో మంది బాధితులు ఉన్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. వారిలో తాను.. రేవంత్‌రెడ్డి కూడా ఉన్నట్లు వెల్లడించారు. హరీశ్‌రావు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌లో బాధితుడే అని చెప్పారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోందని అన్నారు. తన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధం ఉందంటూ బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర, న్యాయంగా విచారణ జరిపించాలని అన్నారు. అవసరం అయితే ఈ కేసును సీబీఐకి కూడా ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కాంగ్రెస్‌ పార్టీకి కూడా సంబంధం ఉందని అనుకోవాల్సి వస్తుందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Next Story