షర్మిల ఏపీలో టైమ్‌పాస్‌ రాజకీయాలకు వచ్చారు: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గరపడుతోంది.

By Srikanth Gundamalla  Published on  13 Feb 2024 9:26 AM GMT
andhra pradesh, minister roja, comments, congress, sharmila ,

షర్మిల ఏపీలో టైమ్‌పాస్‌ రాజకీయాలకు వచ్చారు: మంత్రి రోజా 

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల కోసం శంఖారావం పూరించాయి. ప్రజల్లో సభలు.. ర్యాలీలు.. పాదయాత్రలు చేస్తూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలుగా వైఎస్‌ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయ పరిణామాలు మరింత మారాయి. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలను ఆమె ప్రశ్నిస్తూ నిలదీస్తున్నారు. దానికి అధికార పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ షర్మిలపై తాజాగా మంత్రి రోజా విమర్శలు చేశారు.

వైఎస్‌ షర్మిల ఏపీలో టైమ్‌పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని మంత్రి రోజా అన్నారు. టీడీపీ అదినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లను ప్రజలు నమ్మే పరిస్థితి అస్సలే లేదన్నారు. వారిని ప్రజలు నమ్మడం లేదు కాబట్టే.. పవణ్‌ కళ్యాణ్‌ను అడ్డుపెట్టుకుని రంగంలోకి దిగుతున్నారని అన్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ కూడా అందరికీ బోర్ కొట్టడంతో తాజాగా వైఎస్ షర్మిలను రాజకీయాల్లోకి దించారని మంత్రి ఆర్కే ఆరోజా అన్నారు. వైఎస్ షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాటా కూడా చంద్రబాబు స్క్రిప్ట్‌ అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకి కోవర్టు అయిన రేవంత్‌రెడ్డితో షర్మిల పొత్తు పెట్టుకున్నారని మంత్రి రోజా అన్నారు. వినేవాడు వెర్రివాడు అయితే.. చెప్పేవారు మాత్రం షర్మిలే అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ కుటుంబంలో పుట్టి ఆయన కూతురు అనే గుర్తింపు తప్ప మరో గుర్తింపు ఆమెకు లేదన్నారు. ప్రజల కోసం ఏ పోరాటం చేశారని ఓట్లు అడుగుతారంటూ నిలదీశారు. ఇక చంద్రబాబు చేసే ప్రతి పని వెనుక స్వార్థం ఉంటుందంటూ మంత్రి రోజా తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Next Story