'అయోధ్య రామమందిర కోసం'.. ట్రస్ట్ వేగంగా పని చేస్తోంది
By అంజి Published on 16 Feb 2020 3:23 PM GMTఉత్తరప్రదేశ్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1254 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారణాసి చేరుకున్న ఆయనకు.. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి స్వాగతం పలికారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ.. దానిని జాతికి అంకితం చేశారు. అలాగే 63 అడుగుల ఎత్తుతో నిర్మించిన దీన్దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు ప్రధాని మోదీ.. జంగంవాడీ మఠంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి శ్రీజగద్దురు విశ్వరాధ్య గురుకుల్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఐఆర్సిటీసీ తొలి ప్రైవేట్ రైలు మహాకాళ్ ఎక్స్ప్రెస్ను ఆయన వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ రైలు మూడు జ్యోతిర్లింగాలను తాకుతూ ప్రయాణించనుంది. వారణాసి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్లను కలుపుతూ ఈ రైలు నడవనుంది. వారాణాసిలో కొత్తగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామజన్మభూమి ట్రస్ట్ వేగంగా పనిచేస్తోందన్నారు. దేశ ప్రయోజనాల కోసమే పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ మారేందుకు టూరిజం మెయిన్ రోల్ పోషిస్తోందన్నారు. పలు పర్యాటక ప్రాంతాలను, దర్శనీయ స్థలాలను అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.