క్యాబ్ డ్రైవ‌ర్ల‌ను ఆదుకోవాల‌ని హైకోర్టులో పిల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2020 10:22 AM GMT
క్యాబ్ డ్రైవ‌ర్ల‌ను ఆదుకోవాల‌ని హైకోర్టులో పిల్‌

క్యాబ్ డ్రైవ‌ర్ల‌ను ఆదుకోవాల‌ని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖ‌లు అయ్యింది. ఈ పిల్‌ను న్యాయ‌వాది రాపోలు భాస్క‌ర్ దాఖ‌లు చేశారు. పిటీషనర్ తరపు వాదనలను సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వినిపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 8 ల‌క్ష‌ల మంది క్యాబ్ డ్రైవ‌ర్లు ఉన్నార‌ని, గ‌త మూడు నెల‌లుగా ఉపాధి లేక ఇబ్బందుల‌ను ఎద‌ర్కొంటున్నార‌ని వారిని ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాల‌ని పిటిష‌న‌ర్ కోర్టును కోరారు. మూడు నెల‌లుగా సంపాద‌న లేక‌పోవ‌డంతో ఈఎంఐలు క‌ట్ట‌లేక‌పోతున్నార‌ని తెలిపారు. త‌ప్ప‌ని స‌రిగా ఈఎంఐలు క‌ట్టాల‌ని బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయ‌ని, కొద్ది మంది ఈఎంఐలు చెల్లించ‌లేక ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతున్న‌ట్లు కోర్టు దృష్టికి పిటిష‌న‌ర్ తీసుకువ‌చ్చారు. చాలా మంది క్యాబ్ డ్రైవర్ల రేషన్ కార్డుల‌ను సైతం తొలగించారన్నారు. క్యాబ్ డ్రైవ‌ర్ల స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం ఏం చ‌ర్య‌లు చేప‌ట్టిందో తెల‌పాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. జూన్ 5 న క్యాబ్ డ్రైవర్ల కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని, ఆరోజున మ‌రో సారి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొంది.

Next Story