ఓశునకాన్ని వేటాడేందుకు వచ్చిన చిరుత పులి బాత్రూమ్లో బంధి అయింది. దీంతో వేటాడం సంగతి మరిచి పిల్లిలా నక్కింది. అలా రెండు గంటల పాటు కుక్క తో పాటు చిరుత పులి బాత్రూమ్లో బంధి అయి ఉన్నా కూడా చిరుత వేటాడలేదు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని కైకంబ గ్రామ సమీపంలో జరిగింది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో చిరుతకు శునకం కంటపడింది. వెంటనే దాని వెంట పడింది. ప్రాణభయంతో శునకం రేగప్ప అనే రైతు ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలోకి ప్రవేశించింది. దాన్ని వెంబడిస్తూ వచ్చిన చిరుత కూడా అందులోకి ప్రవేశించింది. ఇది గమనించిన రైతు కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. బయట నుంచి ఆ గది తలుపు గడియ పెట్టారు.
దీంతో ఆరెండు బంధీ అయ్యాయి. పై నుంచి ఫోటోలు తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రెండుగంటలకు పైగా అవి రెండు అక్కడే ఉన్నప్పటికీ చిరుత దానిపై దాడి చేయలేదు.. సరికదా.. పిల్లిలా ఓ మూలకు నక్కింది. సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు వల, మత్తు మందు సాయంతో బంధించేందుకు యత్నించారు. అయితే.. చిరుత అక్కడి నుంచి తప్పించుకుని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. కుక్క కూడా ప్రాణాలతో బయటపడింది. అధికారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో ఆ చిరుత తప్పించుకుని గ్రామస్తులు ఆరోపించారు.