అక్కడకు వెళ్తాం.. వారి బాధను పంచుకుంటాం
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Oct 2020 10:22 AM GMTఎట్టకేలకు హత్రాస్ గ్రామ సరిహద్దులను తిరిగి తెరిచారు. మీడియాను హత్రాస్ గ్రామంలోకి అనుమతిస్తున్నామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. రాజకీయ నేతలను అనుమతించమని ప్రకటించింది. ఈ నేఫథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు హత్రాస్ బయలుదేరారు.
ఈ మేరకు హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ బృందం బయల్దేరుతుందని, ఏ శక్తీ తమను ఆపలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాన్నిపరామర్శించడానికి హత్రాస్కు బయల్దేరుతున్నాం. వారి బాధను పంచుకుంటాం. తమను ఏ శక్తీ ఆపలేదని ట్వీట్లో పేర్కొన్నారు.
హత్రాస్ బాధిత కుటుంబం విషయంలో యోగి సర్కార్ తీరును తాము తట్టుకోలేకపోతున్నామని, నిజమైన భారతీయులెవరూ కూడా తట్టుకోలేరని రాహుల్ మండిపడ్డారు. కాగా, హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ బయల్దేరుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఢిల్లీ ప్లాజా వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా టోల్ గేట్ను మూసేశారు.
ఇదిలావుంటే.. హత్రాస్ అత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలోకి ఎవర్నీ అనుమతించమని పోలీసులు ప్రకటించారు. సిట్ దర్యాప్తు ముగిసే వరకూ మీడియాకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అయితే శనివారం వారి నిర్ణయాన్ని మార్చుకుని.. ఐదుగురు మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.