నిర్భయ దోషుల చివరి కోరిక

By సుభాష్  Published on  24 Jan 2020 6:07 AM GMT
నిర్భయ దోషుల చివరి కోరిక

2012, డిసెంబర్‌ 16న దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు.. ఇప్పుడు దోషులకు ఉరిశిక్ష పడబోతోంది. దేశ చరిత్రలోనే ఒకేసారి నలుగురిని ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు దోషులను 3వ నెంబర్‌ జైలుకు తరలించి సీసీ పుటేజీల ద్వారా వారి ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. ఇక నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేందుకు సమయం దగ్గర పడుతుండటంతో .. మీ చివరి కోరిక ఏంటని తీహార్‌ జైలు అడడగా, వాళ్లు మాత్రం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ కూడా ఉరిశిక్ష వాయిదా పడుతుందనే భావనలో దోషులున్నట్లు జైలు అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. చివరి క్షణంలో కుటుంబీకులను కలువడం, వారి ఆస్తులకు సంబంధించి మాట్లాడటం, ఇతర అంశాలపై దోషులు మాట్లాడుడేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వారు మౌనంగా ఉండటం వెనుక ఇంకా ఉరిశిక్ష పడదనే ఉద్దేశంతో వారున్నారని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తీహార్‌ జైలు వద్ద భారీ బందోబస్తు

నిర్భయ దోషులను ఉరితీసేందుకు తేదీ దగ్గర పడుతుండటంతో తీహార్‌ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ పటియాల కోర్టు ముందుగా ఈనెల 22న ఉరిశిక్షకు తేదీ ఖరారు చేయగా, అందులో ఓ దోషి క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పటిషన్‌ పెట్టుకోవడంతో ఈ తేదీని వాయిదా పడింది. తర్వాత ఫిబ్రవరి 1కి శిక్ష ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు వెల్లడించింది. దోషుల్లో ఒకరు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవడంతో ఆ పిటిషన్‌పై ఏదో ఒకటి తేలే వరకు ఆ క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ఇప్పటికే నలుగురు దోషుల జైలు గదుల వద్ద హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జైలు గార్డుల పర్యవేక్షణలో ఈ నలుగురు దోషులను వేర్వేరు సెల్స్‌ లో ఉంచారు. సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం.. ఇతర ఖైదీల మాదిరిగానే నిర్భయ దోషులు వారానికి రెండు సార్లు వారి వారి కుటుంబీకులను కలిసే అవకాశం ఉంది. కానీ ఈ నలుగురు దోషులకు కోర్టు డెత్‌ వారంట్‌ జారీ చేయడంతో వారు చివరి సారిగా కుటుంబ సభ్యులను కలిసేందుకు తీహార్‌ జైలు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. ఉరిశిక్ష తేదీకి ముందే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌ సెంట్రల్‌ జైలు తలారీ పవన్‌ కుమార్‌ తీహార్‌ జైలును సందర్శించి ఉరి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Next Story