నిర్భయ కేసులో న్యాయవాదికి భారీ జరిమానా..ఎందుకంటే
By సుభాష్ Published on 19 Dec 2019 2:25 PM GMTనిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్కుమార్ గుప్త తరపున న్యాయవాది ఏపీ సింగ్కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. తగిన ఆధారాలు సమర్పించకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ , ఆయనకు రూ.25వేల జరిమాన విధించింది. ఈమేరకు ఏపీ సింగ్పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, 2012 డిసెంబర్ 16న ఢిల్లీలోనిర్భయ ఘటన జరిగిన విషయం తెలిసిందే. తన క్లైంట్ పవన్ కుమార్ దోషిగా తేలాడు. మైనారిటీ (జువైనల్) తీరలేదంటూ న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దోషికి జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్పై గురువారం విచారించిన ఢిల్లీ హైకోర్టు సదరు న్యాయవాదిపై మండిపడింది.
సరైన ఆధారాలు సమర్పించకుండా పిటిషన్ వేయడం, విచారణ సమయంలో గైర్హాజరు కావడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు సాక్ష్యాల ఆధారంగా ఘటన సమయంలో పవన్ జువైనల్ కాదని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి జువైనల్ జస్టిస్ యాక్ట్ అంశం తమ పరిధిలోకి రాదని కోర్టు పేర్కొంది. దోషి మరణ శిక్షను తప్పించాలనే ఉద్దేశంతోనే ఏపీ సింగ్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అక్షింతలు వేసింది.