కొత్త దంపతుల మధ్య చిచ్చు పెట్టిన చికెన్‌.. భార్య మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 11:42 AM GMT
కొత్త దంపతుల మధ్య చిచ్చు పెట్టిన చికెన్‌.. భార్య మృతి

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు. చికెన్‌ కర్రీ ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. భార్య వెజిటేరియన్‌ కాగా.. భర్త నాన్‌ వెజిటేరియన్‌. ఆ భర్త చికెన్‌ తెచ్చి వండమని తన తల్లికి చెప్పాడు. ఇంట్లో చికెన్‌ వండకూదడని భార్య చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళితే.. దయాళ్‌(22) తన తల్లిదండ్రులతో కలిసి లఖింపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 19న దయాళ్‌కు రేష్మా(19) అనే యువతితో పెళ్లి అయ్యింది. కాగా.. రేష్మా వెజిటేరియన్‌. సోమవారం దయాళ్‌ చికెన్‌ తీసుకువచ్చాడు. వండమని తన తల్లికి ఇచ్చాడు. అది చూసిన రేష్మా.. ఇంట్లో చికెన్‌ వండకూడదని, అంతలా తినాలని అనిపిస్తే.. బయట వండుకోమని చెప్పింది.

రేష్మా చెప్పిన మాటలను దయాళ్ పట్టించుకోలేదు. ఇంట్లోనే చికెన్‌ను వండాలని తల్లికి చెప్పాడు. ఈక్రమంలో కొత్త దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం రాత్రి విషం తాగారు ఇద్దరు. గమనించిన దయాళ్‌ తండ్రి వారిద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ రేష్మ చనిపోయింది. దయాళ్‌ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. వారిద్దరికి ఇటీవలే వివాహం అయిందని, సోమవారం రాత్రి చికెన్‌ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. భార్య రేష్మా మృతి చెందగా.. భర్త దయాళ్‌ పరిస్థితి విషమంగా ఉందన్నారు. దయాళ్‌ స్టేట్‌మెంట్‌ తీసుకున్నాకే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Next Story