82 వేలు అని చెప్పిన చైనాలో 6 లక్షల కేసులా..!
By తోట వంశీ కుమార్
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47.16లక్షలు దాటగా.. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 3.12 లక్షల మంది మృత్యవాత పడ్డారు. చాలా దేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తున్నప్పటికి చైనాలోని వుహాన్ నగరంలో ఈ మహమ్మారి ఊసే లేదు. తమ దేశంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని చైనా చెబుతున్న లెక్కలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కేసుల విషయంలో ఇండియా కూడా చైనాను దాటేసిందని వార్తలు వచ్చాయి. కాగా.. చైనా ప్రస్తుతం చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా కేసులు నమోదు అయ్యి ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. చైనాలో ఇంత వరకూ 6.40లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయని చైనాకు చెందిన రక్షణ సాంకేతిక జాతీయ విశ్వ విద్యాలయం తయారు చేసిన ఓ రిపోర్టు లీక్ అయి, సంచలనం సృష్టించింది
చైనా దేశ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్లో నమోదైన కేసులన్నిటినీ క్రోడకరించి ఈ గణాంకాలు అంచనా వేస్తున్నామని, దేశంలో 230 నగరాల్లో నమోదైన రికార్డును పరిశీలించామని నివేదిక పేర్కొంది.
చైనా చెబుతున్న గణాంకాల ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 82 వేల కరోనా పాజిటివ్ నమోదు అయ్యాయి. ఇక మన దేశంలో కూడా కరోనా కేసులు ఇప్పటికే చైనాను క్రాస్ చేసి 90 వేలు దాటేసి లక్షకు అతి చేరువలో ఉన్నాయి. అలాంటిది అసలు కరోనా వైరస్ పుట్టిన చైనాలో కేవలం 82 వేల కేసులు మాత్రమే ఉన్నాయని చైనా చేసిన ప్రకటన ప్రపంచానికే అనేక సందేహాలు రేకెత్తించింది. చైనాలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కాగా.. సమీప భవిష్యత్తులో చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుందంటూ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.