రంగంలోకి ఎన్ఐఏ.. మావోయిస్టులతో సంబంధాలున్నాయని..
By అంజి Published on 7 March 2020 2:26 PM GMTహైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. తెలంగాణలో అరెస్ట్ అయిన పౌరహక్కుల సంఘం నేతలపై కేసు నమోదు చేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటిని కస్టడికి ఇవ్వాలని గద్వాల కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది.
ఎల్బీనగర్ మావోయిస్టు దంపతులు రవి శర్మ, అనురాధల వద్ద దొరికిన ఆధారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో మావోయిస్టులుగా పనిచేసిన రవిశర్మ, అనురాధ పోలీసులకు లొంగిపోయారు. ఇటీవల ఎల్బీనగర్ పోలీసుల అరెస్ట్తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రవిశర్మపై దేశ వ్యాప్తంగా 16 కేసులు నమోదు అయ్యినట్టు సమాచారం. రవిశర్మ వద్ద దొరికిన డాక్యుమెంట్లలో మద్దిలేటి, వరవరరావు, సమాచారాన్ని పోలీసులు సేకరించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో దాదాపు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో తెలంగాణ విద్యార్థి సంఘం నేత, చైతన్య మహిళ సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేతలు ఉన్నారు.
ఖమ్మం జిల్లా చర్ల, గజ్వేల్, గద్వాల్, కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదు అయ్యాయి. అరెస్ట్ అయిన వారిపై యూఏపీఏ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వరంగల్, ఖమ్మం, చర్లపల్లి, చంచల్గూడ జైళ్లలో నిందితులు ఉన్నారు. మరోవైపు ఎన్ఐఏ కస్టడీలోకి అనుమతి ఇవ్వొద్దంటూ నిందితుల కుటుంబ సభ్యులు అంటున్నారు.