ఢిల్లీలో మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక పథకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా 'లఖ్పతి బిటియా యోజన', 'మేరీ పూంజీ - మేరా అధికార్' పథకాల కింద సుమారు 40 వేల మంది బాలికల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 100 కోట్ల నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేశారు. అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే 'సహేలీ పింక్ స్మార్ట్ కార్డ్'ను కూడా ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఉన్న 'లాడ్లీ' పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ 'లఖ్పతి బిటియా యోజన'గా ప్రభుత్వం మార్చింది. ఈ పథకం కింద ఢిల్లీలో జన్మించి, కనీసం మూడేళ్లుగా అక్కడే నివసిస్తూ, ఏడాదికి రూ. 1.20 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలలోని బాలికలకు ఆర్థిక సాయం అందుతుంది. బాలిక పుట్టినప్పటి నుండి ఆమె చదువులో ప్రతి కీలక దశలోనూ (1, 6, 9, 10, 12 తరగతులు) ప్రభుత్వం నగదు డిపాజిట్ చేస్తుంది. తద్వారా వారు యుక్తవయస్సుకు వచ్చేసరికి గణనీయమైన పొదుపు మొత్తాన్ని పొందుతారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, విద్య మరియు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ పథకాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నిర్దేశించిన 'నారీ శక్తి వందన్' స్ఫూర్తితోనే ఈ అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు.