చార్‌ధామ్‌ యాత్ర... కొత్త గైడ్‌లైన్స్‌ ఇవే..!

Uttarakhand govt issues SOP for Char Dham yatra.చార్‌ధామ్‌ యాత్రపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రకు

By అంజి  Published on  7 Oct 2021 7:04 AM GMT
చార్‌ధామ్‌ యాత్ర... కొత్త గైడ్‌లైన్స్‌ ఇవే..!

చార్‌ధామ్‌ యాత్రపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యలో విధించిన పరిమితులను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరఖాండ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు పోర్టల్‌ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొంది. అలాగే ఇక నుండి భక్తుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని స్పష్టం చేసింది. పోర్టల్ నుండి యాత్ర ఈ-పాస్‌ అవసరం లేదని తెలిపింది. అంతకుముందు ఉత్తరాఖండ్ హైకోర్టు చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించి భక్తుల విషయంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రోజుకు బ్రదీనాథ్‌కు 1000 మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800 మంది భక్తులు, గంగోత్రికి 600 మంది భక్తులు, యమునోత్రికి 400 మంది భక్తులు అనుమతి ఇచ్చింది. అయితే భక్తుల సంఖ్య పెంచాలని లేదంటే పరిమితులు ఎత్తివేయాలని ఇటీవల ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హైకోర్టును కోరింది.

ఇప్పటికే యాత్ర ఆలస్యంగా ప్రారంభమైందని, భక్తుల సంఖ్యపై పరిమితులు విధించడం వల్ల వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నందున నిబంధనలు సడలించాలని విన్నవించింది.ఈ నేపథ్యంలోనే రోజువారీ యాత్రికులపై విధించిన పరిమితులను హైకోర్టు ఎత్తివేసింది. కొత్తమార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ కానీ 72 గంటల్లోగా తీసుకున్న కరోనా నెగిటివ్ రిపోర్టును కానీ అందించాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా చార్‌ధామ్‌ యాత్ర నవంబర్‌ వరకు కొనసాగనుంది.

Next Story