ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి గడ్కరీ

నేషనల్ హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది

By Knakam Karthik
Published on : 18 Jun 2025 1:47 PM IST

National News, FASTag users, Union Minister Gadkari

ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి గడ్కరీ

నేషనల్ హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. రూ.3 వేలు చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశ వ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ పాస్ యాక్టివేట్ చేసుకున్న నాటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే, అప్పటితో పాస్ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని గడ్కరీ తన పోస్ట్‌లో వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుందని కేంద్రమంత్రి తెలిపారు. పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి త్వరలోనే ఒక ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఈ లింక్ 'రాజ్‌మార్గ్‌' యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ (భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ), ఎంఓఆర్‌టీహెచ్ (రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ) అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

Next Story