విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, అక్కడ వైద్యం చేయించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. బడ్జెట్ - 2026లో భాగంగా ఎల్ఆర్ఎస్ కింద విదేశాలకు పంపే నగదుపై టీసీఎస్ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. గ్లోబల్ ఖర్చులు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించి నగదు లభ్యతను పెంచుతుంది. దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన పథకాన్ని ప్రకటించారు.
అలాగే దేశంలోని రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు 2026 - 27 ఆర్థిక సంవత్సరంలో రూ.1.40 లక్షల కోట్లన గ్రాంటుగా అందించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. అలాగే 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. వివిధ పన్నుల నుంచి రాష్ట్రాల వాటాగా 41 శాతం నిధులను అందించనున్నట్టు ప్రకటించింది.
బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేసేలా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు హెల్తీ బ్యాలెన్స్ షీట్లు, లాభాల్లో మెరుగ్గా ఉన్నాయని, మొండి రుణాలపై నియంత్రణలో ఉన్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. మరింత మెరుగైన రీతిలో వీటిని పటిష్టం చేసేందుకు సంస్కరణల అమలుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీ పని చేస్తుందని వివరించారు.