తమిళనాడు అసెంబ్లీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు వినిపించింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్.. పవన్ పేరును అసెంబ్లీలో ప్రస్తావించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనపై ఇటీవల పవన్ కల్యాణ్ ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తమిళనాడు రాష్ట్రంలో హాట్ టాఫిక్గా మారింది. ప్రభుత్వంలోకి వచ్చేవరకూ ఎవరైనా రాజకీయాలు చేయాలనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయకూడదని దీన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి స్టాలిన్ అంటూ పవన్ ఆ ట్వీట్ లో కొనియాడారు.
ఆ ట్వీట్ను మంత్రి సుబ్రమణ్యన్ అసెంబ్లీ చదివి వినిపించారు. ఈ సందర్భంలో అసెంబ్లీలోని మిగిలిన ఎమ్మెల్యేలు, సీఎం స్టాలిన్ చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
'ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.' అని పవన్ ట్వీట్ చేశారు.