కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్ట‌ర్‌.. ముగ్గురు కార్మికులు మృతి, 12 మందికి గాయాలు

Three Workers Killed In Blast At Chemical Factory In Maharashtra.కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన‌ పేలుడులో ముగ్గురు మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2022 2:56 AM GMT
కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్ట‌ర్‌.. ముగ్గురు కార్మికులు మృతి, 12 మందికి గాయాలు

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ పట్టణంలోని తారాపూర్ ఎంఐడీసీ వద్ద గల కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన‌ పేలుడులో ముగ్గురు కార్మికులు మృతి చెంద‌గా, మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే గామా యాసిడ్‌ను ఉత్పత్తి చేసే యూనిట్‌లో సాయంత్రం 4.20 గంటలకు ఈ ఘటన జ‌రిగింది. పేలుడు తీవ్రతకు ప్లాంట్‌ పైకప్పు లేచిపోయింది.

సమాచారం అందుకున్న బోయిసర్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

"కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు కారణంగా.. ముగ్గురు కార్మికులు మరణించారు.12 మంది గాయపడ్డారు. బాధితుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అని పాల్ఘర్ పోలీసు ప్రతినిధి సచిన్ నవాద్కర్ తెలిపారు.

పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 18 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని బోయిసర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కస్బే తెలిపారు.

ప్రాథమిక విచారణలో.. రియాక్టర్ పాత్రలో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించినట్లు ప్లాంట్ ఇన్‌చార్జి నిర్ధారించారని ఆయన చెప్పారు. "ఈ ప్లాంట్ టెక్స్‌టైల్ పరిశ్రమలో ఉపయోగించే గామా యాసిడ్‌ను తయారు చేస్తుంది. సోడియం సల్ఫేట్‌ను అమ్మోనియాతో క‌లిపే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రియాక్టర్ పేలింది" అని ఆయ‌న చెప్పారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ అధికారుల నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story