రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా నోటిఫై చేసింది. ‘డిసెంబరు 26న లేదా ఆ తరువాత బుక్ చేసుకున్న టిక్కెట్లపై మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఈ తేదీకి ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు’ అని నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నెల 21న ప్రయాణికులపై రైలు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 26 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది.
జనరల్ క్లాస్లో 215KM లోపు జర్నీపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆపై ప్రయాణం చేసేవారికి ప్రతి KMకు పైసా చొప్పున, మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ AC, AC తరగతుల్లో ప్రతి KMకు 2 పైసల చొప్పున పెంచారు. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో మార్పులు లేవు. 500 కిమీకు పైగా ప్రయాణించే వారిపై అదనంగా రూ.10 ఛార్జీ పెరగనున్నట్లు పేర్కొంది. రైల్వే ఛార్జీలను పెంచడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జులైలోనూ ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే.