హర్‌ఘర్ తిరంగా: ప్రతి ఇంటా రెపరెపలాడుతోన్న జాతీయ జెండా

The Harghar Tiranga program started as part of the 75th Independence Day celebrations. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. దేశ వ్యాప్తంగా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం మొదలైంది. స్వాతంత్ర్యం వచ్చి

By అంజి  Published on  13 Aug 2022 9:01 AM GMT
హర్‌ఘర్ తిరంగా: ప్రతి ఇంటా రెపరెపలాడుతోన్న జాతీయ జెండా

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. దేశ వ్యాప్తంగా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం మొదలైంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఇల్లు, కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలన్న ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రధాని సూచనను అందరూ పాటిస్తున్నారు. ఎక్కడ చూసినా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ హర్ ఘర్ తిరంగా కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

హర్ ఘర్ తిరంగా ప్రచారం ఇవాళ ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ఈ ప్రచారం కొనసాగనుంది. భారతదేశ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' భాగంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. జాతీయ జెండాతో సంబంధాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చడం, భారతదేశ అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలు, అమరవీరులను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్యం లక్ష్యం.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయన సతీమణి సోనాల్ షా న్యూఢిల్లీలోని తమ నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. బాలీవుడ్ నటుడు హీరో అమీర్ ఖాన్ కూడా 'హర్ ఘర్ తిరంగా'లో చేరాడు. ముంబైలోని తన నివాసంలో అమీర్ త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. బృందావన్‌లోని తన నివాసంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా ఎంపీ హేమమాలిని జాతీయ జెండాతో కనిపించారు. ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు.

ఇది వరకు జాతీయ జెండాను ఎప్పుడు పడితే అప్పుడు ఎగరేవేయకూడదన్న రూల్‌ ఉండేది. ఇలా ఎవరైనా చేస్తే యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకునేవారు. అయితే జెండా ఎగరేయడంపై విధించిన పరిమితులపై అప్పట్లో ప్రముఖ బిజినెస్‌మేన్‌ నవీన్‌ జిందాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. సుమారు 10 సంవత్సరాల పాటు ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. చివరకు 2004 జనవరి 23న.. జెండా ఎగరవేయడం ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు అని కీలక తీర్పు ఇచ్చింది. రాజ్యాగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఈ హక్కు అందరికీ ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి నుంచి జెండా ఆవిష్కరణకు సంబంధించిన పరిమితులన్నీ తొలగిపోయాయి.


Next Story